2015/03/27

రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది!!

మిత్రులూ!
వాస్తవానికి వనవాసానికి వెళ్ళే సమయానికి రామ చంద్రుడు రాజు అయ్యుంటే బాగుండేది.
సీతమ్మవారిని అడవులకి పంపించే సమయానికి రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది
ప్రజామోద్యంగా ప్రజారంజకంగా పరిపాలించడం రాజు విధి!. రామ చంద్రుండు అదే తు.చ. తప్పకుండా "ధర్మంగా" చేశాడు...
వనావాసనికేగే నాటికి రాముడు ఇంకా చక్రవర్తి కాలేదు... అయ్యుంటే, ఒక రాజుగా, ప్రజాఆమొద్యం మేరకి కానలకి వెళ్లి వుండేవాడు కాదు.ఎందుకంటే అయోధ్య అయోధ్య మొత్తం రామున్ని వెళ్లవద్దని వారించింది ... వేడుకొన్నది... అడ్డుకునంది. కాని రాముడు అప్పుడు ఓ పుత్రుడు , తండ్రి మాటని నెరవేర్చడమే అప్పుటికి తన విధి.
కాని..,,,
మన దురదృష్టానికి సీతమ్మ వారిని అడవులకి పంపించే సమయానికి మాత్రం రామచంద్రుడు ఓ చక్రవర్తి!
నిజానికి సీతమ్మ వారి మీద చాకలి కూతలని అప్పటి ప్రజలెవ్వరూ ఖండించనూ లేదు, సీతమ్మ వారిని అలా అడవులకి పంపించినపూడు "పంపించవద్దు" అని ప్రజలలో ఎవ్వరూ వారించలేదు... అలా జరిగి ఉన్నింటే రాముడు అమ్మవారీని పంపించి వేసే వాడు కాదు... సీతారాముల దాంపత్యం కలకాలం హాయిగా గడిచి ఉండేది...
ప్రజామోధ్యం మేరకి అమ్మవారిని వదులుకున్న రాముడు రాజుగా చేసిన అతి గొప్ప వ్యక్తిగత త్యాగమది....
ఇక్కడ ఇంకో అతి ముఖ్య మైన విషయం చెప్పుకోవాలి ...
చాకలి నింద విషయం రామునికి కాకుండా సీతమ్మకే ముందు తెలిసి ఉండింటే , ఒక మహారాణి గా, సామ్రాజ్ఞి గా , అయోధ్య పట్టమహిషి గా, ముఖ్యంగా "రాముడి మనోజ్ఞ" గా తనకితానుగా అడవులకి వెల్లిపోయి ఉండేది... అది అప్పటి వారి ధర్మం!... వారి గొప్ప జీవన విధానం! .. అది అలాగే జరిగింది. ఎందుకంటే అది సజీవ-చరిత్ర...." ఎందుకు అలానే జరిగింది అని ప్రశ్నించడం మూర్ఖులు చేసే పని"
మన దురదృష్టం ఏమిటంటే రామాయణం చదువుకునే నాధుడే కరువయ్యాడు... కేవలం విన్న వాటితో వాదాలకి దూషణలకి దిగుతున్నారు సిగ్గునొదిలి! ... అందరూ రాముని మీద ఆడి పోసుకునే వాళ్ళే !!... ఇరవై ఏళ్ళుగా రాజ్య మేలుతున్న ఏ నా మీడియాచానలూ నిజాలని ఉన్నది ఉన్నట్టు చెప్పిన పాపాన పోలేదు !... వాల్లకి వివాదాలే కావాలి!!...వివరణలు-సవరణలూ చేత కాని తుఛ్ఛ మీడియాలు మన ధౌర్భాగ్యం గా తయారయ్యాయి! ఇక ఈ విషయంలో సినిమాలు మళిన-మురికి-కూపాలు.
వేల తరాల త్యాగాలతో ఈనాడు మనం ఓ ధర్మంలో పుట్టి సురక్షణతో పెరగ గలుగుతున్నాం...
దానిని కాపాడుకోవల్సింది పోయి ప్రేళాపనలకి పోవడం "స్వాభిమానం లేని జాతిద్రోహంతో" సమానం.
లోకమంతా మనముందు ముఖస్తుతితో మెచ్చుకునేదే ..కాని
మనలని మనం సరిదిద్దుకునే అవకాశాల్ని
ఈ ప్రపంచం మనకు చాలా తక్కువగా ఇస్తుంది.
అలాంటి అవకాశాలు ముఖ్యంగా రెండు రకాలు
ముక్కుసూటిగా మన తప్పులు ఎత్తిచూపి మనలను సరిదిద్దే ఆత్మీయులు,
దిక్కూమొక్కూ లేక దారితప్పిన బ్రతుకులని సరిదిద్దే గొప్ప గ్రంథాలు...
మొదటిది సత్సంగం ద్వారా దొరుకుతుంది....
రెండవది స్వాధ్యాయం ద్వారా దొరుకుతుంది.
సత్సంగం అంటే సంస్కార వంతుల సాన్నిహిత్యం.
స్వాధ్యాయం అంటే సంస్కరించే గ్రంథాల సాహిత్యం
అలాంటి ఉత్తమ గ్రంథాలలో అతి ముఖ్యమైనది "శ్రీమద్రామాయణం"
’రామస్య అయనమ్ రామాయణం’
రామున్ని పొందే వైపుగా తీసుకెళ్ళేది రామయణం.
ప్రపంచం మొత్తంలో అతి పురాతనమైన మొట్ట మొదటి కవిత్వం, కావ్యం ...ఆది కావ్యం రామయణం..
అందుకే శ్రీ వాల్మీకి మహర్షి ని ఆదికవి అని, కవికోకిల అని, అలాగే శీరామాయణాన్ని ఆదికావ్యమని అంటాం.
అందుకే పాండిత్యమున్న పెద్దలందరూ ఈ మహత్తర కావ్యాన్ని వారి భాషలో, వారి బాసలో చెప్పుకున్నారు...అనువదించుకున్నారు .... ఆనందించుకున్నారు...
శ్రీ ఆధ్యాత్మ రామాయణం- శ్రీ వ్యాసభగవానుడు
శ్రీ రామచరితమానస్- శ్రీ గోస్వామి తులసీదాస్ మహరాజ్.
శ్రీ భావార్థ రామాయణం - శ్రీ సంత్ఏక్‌నాథ్ జీ మహరాజ్
శ్రీ గోపీనాథ రామాయణం - గోపీనాథం శ్రీ వేంకట కవి గారు
శ్రీ మొల్ల రామాయణం - శ్రీ కవయిత్రి మొల్ల గారు
శ్రీ రంగనాథ రామాయణం- శ్రీ గోన బుధ్ధారెడ్డి గారు
శ్రీ కంబ రామాయణం - శ్రీ కంబరుకవి
ఇలా చెబుతూ బోతే... ఆనంద రామాయణం, భాస్కర రామాయణం, చెంపూరామాయణం, విచిత్ర రామాయణం, నిర్వచనోత్తర రామాయణం , ఉషశ్రీ రామాయణం, రాజాజీ రామాయణం... ఎన్నో ఎన్నెన్నో...
కానీ అంన్నింటికీ మూలం వాల్మీకీకృత మూలరామాయణమే...
ఉడతా భక్తి, శభరి ఎంగిలి, లక్ష్మణ రేఖ, రాతి అహల్య, మహిరావణ వధ, ఇల్లాంటి ఎన్నో కల్పితాలు ప్రేమతో చేర్చ బడ్డాయి ...
అవి ప్రేమ తో చేర్చాలనే కాని
రామాయణాన్ని మార్చాలని కాదు...
అయితే అవన్నింటినీ వారు భక్తిపారవశ్యంతో ప్రేమ తో రాసుకున్నవి.
వాస్తవానికి అవి ఒకరికి చెప్పడానికి రాసిన వి కాదని నా అభిప్రాయం,
ఎందుకంటే అనువదిస్తున్నంత సేపూ వారు పొందే అనుభూతి వర్ణించరానిది.
ఆత్మ సంతృప్తితో , ఒక యజ్ఞం లా....అదొక తపస్సులాంటి పెద్ద కార్యం!
విశ్వనాధ సత్యరాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షం పై ఎవరో విలేకరి " మీ రామాయణం అంతగా బాగాలేద"న్నాడట. దానికి వారు ఇచ్చిన సమాధానం "దానిని నేను ఇతరులకొరకు రాయలెదు కదా!" అని.
ఇంత మంది వ్రాసిన రామాయణం మళ్ళీ వ్రాయడానికి విశ్వనాధ చెప్పిన కారణం...
మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయు చున్నది, తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావి గాన
ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారు కావ్య రచనా హేతువును వివరించారు.
సుహృదులైన పెద్దలకి ఒక విన్నపం , మూల గ్రంధాలకి , ఇతిహాసాలకి ... ఇప్పోడొస్తున్న వినోదాత్మక, వ్యాపారాత్మక సీరియల్లకి, కార్టూన్స్ కి, అలాగే వితండ మైన చర్చలకి, ఎలాంటి సంబంధం లేదని పిల్లలకి నచ్చచెప్పండి.
వివరణకై వారిని స్వాధ్యాయానికై ప్రేరేపించండి....లేకపోతే పసిహృదయాలు పొరపాటు పడే అవకాశముంది, "అమాయకులు మూర్ఖులు గా మారే ప్రమాదముంది.".
ఇక శ్రీ రామచంద్రమూర్తి విషయానికొస్తే....
’దేవుడి’ లా అవతరించి మహిమలు,మాయలు,లీలలు చేసి..
తన ’ప్రభావం’ తో ఆకర్శించువాడు కాదు రాముడు.
’మనిషి’ లా పుట్టి సౌశీల్యం, సత్యవ్రతం, ధర్మ నిరతితో
తన ’స్వభావం’ తో ఆకర్శించువాడు మన రాముడు.
అనంతకల్యాణగుణాభిరాముడు మన రాముడు.
రాముని కొన్ని స్వభావాలు ...
రామో విగ్రహవాన్ ధర్మః ---ధర్మానికి నిలువెత్తు రూపం రామునిది
పుంసాన్ మోహన రూపుడు -- మగ వారిని సైతం మొహింపజేయు తేజస్సు కలవాడు
మిత భాషి - తక్కువగా మాట్లాదు వాడు
పుర్వ భాషి - ముందుగా తనే పలకరించు వాడు.
ప్రియ వాదినః - ప్రియంగా మాట్లాడే వాడు
మర్యాదా పురుషోత్తముడు - మర్యాద గల పురుషులలో ఉత్తముడు.
పసితనాన ఆటపాటలలో ఎప్పుడూ తనే ఓడి..తమ్ములని గెలిపించి ఆనందపడే ’వాత్సల్య మూర్తి’ రాముడు.
అంతటి రాజ కుమారుడు రాజ్య వీధుల వెంట నడుస్తూ పిల్లలని, పెద్దలని తనే ముందుగా పలకరిస్తూ ప్రేమగా ముందుకు సాగే ’సరళ స్వభావుడు’ రాముడు.
అడవులకేగిన సమయాన తన తండ్రి దశరతుని మరణ వార్త విని పదే పదే ముమ్మారు సొమ్మసిల్లిన ’సున్నిత మనస్కుడు’ రాముడు.
కైక మొండి తనాన్ని తగ్గించడానికి ఎక్కువసమయం తల్లి కైక తోనే గడిపేవాడట రాముడు...
వనవాసం చేయాల్సి వచ్చినపుడు సీతమ్మ వారిని వారించి అయోధ్యలోనె వదిలివెలతానని, సుఖంగా వుండమని అడిగితే ,
తనని విడిచి వుండలేని కోపంతో "రామా నీవు నాకు పురుషుని రూపం లో ఉన్న స్త్రీ గా కనివిస్తున్నావం "టుంది సీతమ్మ! అది దాపత్యం లో ఉండాల్సిన స్వతంత్రం ..చనువు.
"సీతా! నీ దుఃఖాన్ని చూడలేను, నాకు ఎవరినుండి భయం లేదు, నీ అభిప్రాయం తెలుసుకోకుండా నిన్ను తీసుకెళ్ళలేకే అలా అన్నాను ... నీ ఈ నిర్ణయం పుట్టింటిని, మెట్టింటినీ కీర్తిమయం చేసేది...పద" ఇవి నారాముని మాటలు (మూలరామాయణం)..అంతటి ’ముందుచూపున్న వాడు’ రాముడు.
మత్త: ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణః
" రామునికి నాకంటే తమ్ముడయిన లక్ష్మణుడే ప్రియుడు " ఇది సితమ్మ వారు అశోక వనం లో హనుమతో చెప్పిన మాటలు !
అందుకే రాముడు లక్ష్మణున్నికూడా వారించాడు.
రామస్య దక్షిణో బాహుర్నిత్యం ప్రాణో బహిశ్చరః
"రామునికి కుడిభుజం లాంటి వాడు , బహిః ప్రాణం లక్ష్మణుడు "
ఖరదూషణాదులు మెత్తం 14000 మంది రాక్షసులని ఒక్కడే ఎదుర్కొని హతమార్చిన ’అతులిత పరాక్రమ సంపన్నుడు ’ రాముడు.
సీతమ్మవారిని ఏడి పించడానికి కాకిలా వచ్చిన అసురుని పైకి విసిరిన గడ్డిపుల్ల, ఆ కాకాసురుడు 14 లోకాలు వెళ్ళి, బ్రహ్మాదులనెంతో మందిని శరణు వేడినా వదలలేదు..చివరికి వాడు రామున్నే శరణు వేడగా..వదిలిన అస్త్రం ఊరికే పోక వాడి కన్ను పీకేసుకు పొయింది.. అమ్మవారిని ఏడిపించే వారి విషయంలో రాముడు తీరు ఇది (జాగ్రత్త!!).
"రాముడు వదిలిన మాట, రాముడు వదిలిన అస్త్రం ఎన్నటికీ వ్యర్థమవ్వవు! "
సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకెళ్ళిన తరువాత ..పువ్వుచూసినా, పండు చూసినా,"హా! సీతా!" ని ఏడ్చే వాడట ... ఎడబాటుని, విరహాన్ని తట్టుకోలేని ’ఆర్థహృదయము ’ రామునిది.
వరగర్వం తో తమ్ముని బార్యని ఎత్తుకు పోయి, రాజ్యాన్ని కైవసం చేసుకొని, కొట్టి, తరిమేసి , ’జంతువులా’ ప్రవర్తించిన వాలిని ’జంతువు’ ని చంప్పినట్టు చాటుగా చంపాడు రాముడు...
*** స్త్రీ ని గౌరవించని వాడెవ్వడికైనా అదే శాస్తి జరగాలి.
రామునికోపానికి సముద్రుడైనా గజ గజ వనకాల్సిందే!
రాముని నామం తో బండలు సైతం పులకించి తేలిక పడతాయి, నీట తేలుతాయి...
రామ-రావణ యుధ్ధంలో పూర్తిగా చిత్తుగా అలసిన రావణున్ని వెళ్ళి కోలుకొని రేపు యుద్దానికి తిరిగి రమ్మన్న దయా హృదయుడు రాముడు... సమరాంగాన కూడా స్వభావమ్ కోల్పోని వైభవం కలవాడు రాముడు.
శరణన్న వాన్ని శతృవునైనా చేరదీసే వాడు రాముడు...విభీషనున్నడగండి చెబుతాడు.
"అన్నా! రాముడు అత్యంత సహజసిధ్ధమైన వీరుడు, ఏమరుపాటులేనివాడు, జయం మీద నిశ్చయమున్నవాడు,బలవంతుడు, నిగ్రహవంతుడు మీరు రామున్ని ఏమ్చేయగలరు?" ఇవి విభీషణుడు రావణునితో అన్న మాటలు...శత్రువులకి సైతం ఆయనంటే ఏంటో తెలుసునని అర్థమౌతుంది...ఒక్క మూర్ఖులకి తప్ప.
లక్ష్మణుడు మూర్ఛపోయినపుడు రాముడన్న మాటలివి "నా కోదండం జారిపోతున్నది, ప్రపంచం శూన్య మనిపిస్తున్నది, రక్తసిక్తమైన నా తమ్ముని చూసిన తరువాత కూడా నాకు యుధ్ధమెందుకు, విజయమెందుకు. భార్యలు కావాలంటే దొరుకుతారు, బంధుజనాలు కావాలంటే దొరుకుతారు నీలాంటి తమ్ముడినెక్కడతెచ్చేది ?"...వారి సహొదర ప్రేమ అనన్యసామాన్యమైనది. అజరామరమైనది.
రాముడన్ని బాధలనీ ఒక సామాన్య మానవుడనిభవించినట్టు సహజంగా అనుభవించాడు... ఇక్కడ మనం తెలుసుకోవలసిందీ, తేలిక పడాల్సింది చాలా వుంది.
లంకని జయించినా రాజ్యాన్ని విభీషణునికిచ్చిన త్యాగ శీలి...తనకి స్పష్టత వుంది తను ఏంచేస్తున్నదీ, ఎవరికోసం పోరాడుతున్నదీ ...అందుకే నా రాముడు పరమ పవిత్రుడు.
నారామునిరాజ్యం లో వృష్టి(కరువు) అనేదే లేదు,
ప్రజల మనసులు ఎప్పుడు ఉల్లాసంగా ఉండేవి,
రోగాలుండేవి కావు, అకాల మరణాలుండేవి కావు,
దొంగతనాలు దోపిడులు ఉండేవి కావు,
రాముని రాజ్యం లో గుమ్మాలకి తలుపులుండక పోయేవట!
రాజ్యం లోని స్త్రీలంతా నిత్య సుమంగళులు గా వుండే వారట!
కౄర జంతు భయమ్ ఉండేది కాదట!
పెద్దవాళ్ళుండగా పిల్లల మరణాలు జరగక పోయేవట!
ప్రజల్లో ప్రశాంతత, నిర్మలత్వం తొనిఇస లాడేవట!
(త్రేతా యుగంలో తలుపులుండక పోయేవట...ద్వాపర యుగంలో తలుపులొచ్చాయట ... కలియుగారంభంలో తళాలు మొదలయ్యాయట ! భాగవతం చెబుతుంది.)
"ప్రజ" అంటే సంతానమని అర్థం...సంతానం పట్ల రాముడికి కోపమెన్నడూ ఉండేది కాదట.
రాముని 10000 సంవత్సరాల పాలన జనరంజకంగా వున్నదట!
రమో రామో రామ ఇతి ప్రజానా మభవన్ కథా:
రామ భూతం జగద భూ ద్రామే రాజ్యం ప్రశాసతి |
ఎప్పుడు, ఎక్కడ చూసినా రామా రామా రామా అంటూ ప్రజలు రాముని కథలనే చెప్పుకునే వారట!
వారికి జగమంతా రామమయంగా శోభించేదట!
రాముని నిర్యాణగడియల ముందు మృత్యువే(కాలుడు) రాముని చెంత అనుమతి కోసం వేచియున్నాడట!
రాముని జీవితమంతా త్యాగాలమయం, రాజ్యము, పత్ని, సహోదరులు, సంతానం, అన్నింటినీ త్యాగం చేసాడు. కాని తను త్యాగం చేయనిదేదైనా ఉన్నదంటే అదొక్కటే..ధర్మం!.
ఆయనఎవ్వరినీ తన బలంతో, ప్రభావంతో మార్చలేదు...తన స్వభావంతో మార్చాడు, మారుస్తాడు, మారుస్తేనె వుంటాడు.
రామచంద్రున్ని పొగడాలంటే, టపా పెద్దదైపోతుందనే కానీ , నాకు వేయి నాలుకలుంటే బాగుండునే అనిపిస్తుంది... వేనోళ్ళ పొగిడేవాడిని! వేయినామాలవాన్ని!!
ఆపదామపహర్తారం దాతారం స్వర్వ సంపదాం|
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం ||
ఆపదలని హరించువాడు, స్వర్వ సంపదలనిచ్చువాడు,
లోకానికి ఆనందాన్నిచ్చువాడు అయిన శ్రీరామచంద్రునకు పదే పదే నమస్కరిస్తున్నాను!
సర్వకాల సర్వావస్థలయందూ మనసు రామభద్ర భగవానుని చరణనళినాలయందే రమించును గాక!
||జై శ్రీరాం ||
-సత్య



2 comments:

  1. // ఆయనఎవ్వరినీ తన బలంతో, ప్రభావంతో మార్చలేదు...తన స్వభావంతో మార్చాడు, మారుస్తాడు, మారుస్తేనె వుంటాడు. //

    // మనిషి’ లా పుట్టి సౌశీల్యం, సత్యవ్రతం, ధర్మ నిరతితో తన ’స్వభావం’ తో ఆకర్శించువాడు మన రాముడు. //

    సత్య గారూ, అత్యద్భుతంగా వ్రాశారు. ప్రత్యేకంగా పైరెండు వాక్యాలు మహాద్భుతః.

    శ్రీరామనవమి నాడు శ్రీరాముని వైభవం గురించిన చక్కని వ్యాసం చదివాను. మీకు అనేక ధన్యవాదములు !!

    ReplyDelete